ఆశారాం బాపు కేసులో తీర్పు వాయిదా | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపు కేసులో తీర్పు వాయిదా

Published Sat, Apr 7 2018 7:47 PM

Jodhpur Court Postpones Verict On Asaram Bapu  - Sakshi

జోధ్‌పూర్ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై తీర్పును రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు రిజర్వ్ చేసింది. శనివారం ఈ కేసును విచారించిన కోర్టు తీర్పును ఈ నెల 25న వెలువరించనుంది. మైనర్ బాలికపై కొన్నేళ్లపాటు లైంగి దాడులకు పాల్పడ్డారన్న కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారం బాపు జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇదే జైలులో సల్మాన్ ఖాన్ రెండు రోజులు ఉన్న తర్వాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.  

ఈ కేసులో దోషిగా తేలితే ఆశారం బాపునకు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2013 ఆగస్ట్ 3వ తేదీన ఈ ఆధ్యాత్మిక గురువును జోధ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బెయిల్ కోసం ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసుకున్నా కోర్టులు అందుకు నిరాకరించాయి. 1997-2006 మధ్యకాలంలో అహ్మదాబాద్‌ శివార్లలోని ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆశారాం బాపు పలుమార్లు తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని బాలిక 2013లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జోధ్‌పూర్ జైల్లో ఉన్న ఆశారాం బాపు భవితవ్యం కోర్టు తీర్పుతో మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Advertisement
Advertisement